అది నిరూపిస్తే ఆస్తి రాసిస్తాను అంటున్న “మా” అధ్యక్షుడు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా ఆ సంఘం నిధులను మింగేశాడని, మెగా ఈవెంట్తో వచ్చిన ఫండ్స్ నుంచి కొంత సొమ్మును దుర్వినియోగం చేశాడని ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో స్టోరీ ప్రస్తుతం ఫిలిం నగర్ లో చర్చనీయాంశం అయింది. ఈ అంశంపై గత శనివారం ఇప్పటికే ఒకసారి సమావేశం నిర్వహించారు. ఆరోపణలపై విచారణ కమిటీ వేయడానికి ప్రతిపాదించగా మరో వర్గం వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై మా కార్యవర్గం సోమవారం సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఆరోపణలపై శివాజీరాజా, శ్రీకాంత్ స్పందించారు. దీనిలో ఎలాంటి వాస్తవం లేదు. ‘మా’ సిల్వర్ జుబ్లీ వేడుకల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఒకవేళ జరిగాయని నిరూపిస్తే ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటామని శివాజీరాజా, శ్రీకాంత్ తెలిపారు.
మా అసోసియేషన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా కొత్త బిల్డింగ్ కట్టడానికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు ఇచ్చారని చెప్పారు. ఫండ్స్ కోసం అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా నిర్వహించిన మా సిల్వర్ జూబ్లీ ఈవెంట్ తో కోటి రూపాయలు వసూలైందని శివాజీరాజా తెలిపారు. తరువాత స్టార్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్లు వస్తారని చెప్పారు. శివాజీ రాజా మా అసోసియేషన్ డబ్బులతో ఇప్పటి వరకు కనీసం ఒక టీ కూడా తాగలేదని, ఫోన్ కూడా తనదే వాడుతున్నానని తెలిపారు. ‘నా పిల్లల మీద ఒట్టు, నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని నిరూపిస్తే నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తాను.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘మా’ ఎన్నికల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారని, వాళ్లు పని కట్టుకొని తాము చేసే ప్రతి పనిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ‘మా’ అసోసియేషన్ లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని స్పష్టం చేశారు. మా అసోసియేషన్లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయని పరుచూరి వెంకటేశ్వరావు తెలిపారు. నా పై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుంటానని శివాజీ రాజా సంచలన ప్రకటన చేశారు. అవకతవకలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఇకపై అసోసియేషన్ గడప తొక్కనని శ్రీకాంత్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.